జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే తీవ్ర వివాదానికి కారణమైన ఈ అంశంలో తాజాగా మరో వీడియో బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఓ మహిళతో వీడియో కాల్ చేసిన దృశ్యాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
అసెంబ్లీ ప్రాంగణం నుంచే మహిళకు వీడియో కాల్ చేసి మాట్లాడిన వీడియోను స్వయంగా బాధితురాలే మీడియాకు విడుదల చేయడంతో వివాదం మరింత ముదిరింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా నిలిచే అసెంబ్లీ ఔన్నత్యాన్ని ఇలాంటి చర్యలు దిగజార్చుతున్నాయని పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన వేదికలో ఒక ఎమ్మెల్యే మహిళతో వీడియో చాటింగ్ చేయడం అసెంబ్లీ చరిత్రలోనే ఎవరూ చేయని గలీజు చర్యగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది.
ప్రభుత్వ విప్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తన రావడం దురదృష్టకరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించడం మాత్రమే కాకుండా, అసెంబ్లీ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై జనసేన పార్టీ నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాకపోవడంపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మానసిక దారిద్య్రాన్ని ఈ వ్యవహారం బయటపెడుతోందని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన వీడియోలు, ఆరోపణలతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత తీవ్రతరమవుతోంది.
జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై వస్తున్న ఆరోపణలపై స్పీకర్, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, అసెంబ్లీ గౌరవాన్ని కాపాడే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.








