జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖపట్నం జగదంబ జంక్షన్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటుపై ఎమ్మెల్యే వంశీ, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది.
స్థానిక సమాచారం ప్రకారం, జగదంబ జంక్షన్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఎమ్మెల్యే వంశీ వర్గీయులు ఏర్పాటు చేశారు. అయితే, ఆ విగ్రహం ఏర్పాటుపై కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. మూర్తి యాదవ్ ఫిర్యాదుతో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని జనసేన నేత మన్యాల శ్రీనివాస్ తొలగించారు. విగ్రహం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని, త్వరలో కృష్ణ వర్ధంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ పెద్దలకి తెలియజేసే కృష్ణ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. జనసేన జెండా దిమ్మ తొలగించి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నది పూర్తిగా అవాస్తవమని మన్యాల శ్రీనివాస్ తెలిపారు.
అయితే, దీనిపై పీతల మూర్తి యాదవ్ భిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. “జనసేన జెండా దిమ్మ స్థానంలో విగ్రహం ఏర్పాటు చేశారు. అందుకే ఫిర్యాదు చేశాను. విగ్రహం ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు. కానీ పార్టీ ప్రతీకలు తొలగించి విగ్రహం ఏర్పాటు చేయడం తగదు” అని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనతో జనసేనలో వర్గ విభేదాలు మరోసారి స్పష్టమయ్యాయి. పార్టీ శ్రేణుల్లో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.








