కాపు నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడి జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంపై ట్రాక్టర్తో దూసుకొచ్చిన యువకుడు బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో బలంగా ఢీకొట్టిన యువకుడు అంతటితో ఆగకుండా జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ బీభత్సం చేశాడు. ఈ దాడిలో కారు వెనుకభాగం డ్యామేజ్ అయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముద్రగడ అనుచరులు, వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పద్మనాభం ఇంటికి చేరుకున్నారు. ఆ యువకుడి చర్యను తీవ్రంగా ఖండించారు. ముద్రగడపై జనసేన కక్షసాధింపులకు దిగుతోందని మండిపడ్డారు.