కూటమి పార్టీల మధ్య విభేదాలు మొదలైన నేపథ్యంలో కడపలో ఏర్పాటు జనసైనికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తీవ్ర కలకలం రేపుతోంది. జనసేన బలం 21 మాత్రమే అని టీడీపీ (TDP) భావిస్తోందని, కానీ ముఖ్యమంత్రి కుర్చీ జనసేన (Jana Sena) వేసిన భిక్ష అని మరిచిపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అబ్దుల్ కలాం గారు మనం మనకు వచ్చే కలలు నెరవేర్చుకునేదానికి కష్టపడమన్నారు.. వేరే వాళ్ళవి కాదు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశిస్తూ కడపలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమిలో ఉండేదానికంటే కనీసం ప్రతిపక్షంలో ఉన్నా జనసేనకు మంచి పేరు ఉంటుందని, లేకపోతే దరిద్రం అంతా జనసేన నెత్తికి చుట్టుకుంటుంది, తట్టుకోలేకపోతున్నాం అన్నా.. అంటూ పవన్ కళ్యాణ్కు మొరపెట్టుకుంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
‘పవన్ అన్నా.. మేము అప్పుడే చెప్పాం ఆయనతో వ్యవహారం అంత వీజీ కాదు అని.. 21 సరిపోవు 50 తీసుకోమని చెప్పాం మీరు వినలేదు.. 21 తో గేమ్ ఛేంజర్ అవ్వలేము అన్నా అని చెప్పాం, ఇప్పుడు మన పరిస్థితి అదే సినిమా ఆ సినిమా పరిస్థితిలాగే తయారు అయ్యింది. వాళ్ళు మనకున్నది 21 నే కదా అని అనుకుంటున్నారు కానీ ఆ కుర్చీ మనం ఇచ్చిన భిక్ష అని మర్చిపోయారు, వాళ్ళు, వాళ్ళ భజన బృందం చెప్పేటివి ఎవరు నమ్మట్లేదు కాబట్టే మనతో Alliance పెట్టుకున్నారు. ప్రచారం లో మీరు చెప్పినవే ప్రజలు విన్నారు.’

‘మనము ఇంకా మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకొకరికి 11 కాదు 110 వచ్చేట్టవి. మీరు ఏమో నిజాయితీ గా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్తారు కానీ వాళ్ళు మాకేం సంబంధం అంటారు, మళ్ళీ ఆ తప్పులు చేసే వాళ్ళల్లో ఉండేది వాళ్ళ మనుషులే.. ఎప్పుడు వాళ్ళు ఆడే ఆటలో మనం బొమ్మలం అవుతున్నాం తప్పా ఆట ఆడే టాలెంట్ మన దగ్గర లేదా అన్నా..’
‘మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రమే Davos వెళ్ళారు అక్కడ వాళ్లను పట్టించుకునే నాధుడు లేడు కనీసం మీరు వెళ్ళి ఉన్న మిమ్మల్ని చూసి నాలుగు కంపెనీలు వచ్చేవి. ప్రజల డబ్బుతో అంత దూరం వెళ్ళి ఇక్కడ చేసేది చాలదు అని అక్కడ జాకీలు పెట్టి లేపుకునే ప్రయత్నం, లేపలేనంత బరువు ఆయన కింద ఉన్నప్పుడు ఎన్ని జాకీలు వాడితే ఏం లాభం. కనీసం ప్రతిపక్షంలో ఉన్నా మనకు మంచి పేరు ఉంటుంది. లేక పోతే ఆ దరిద్రం అంతా మన నెత్తికి చుట్టుకుంది అన్నా, తట్టుకోలేక పోతున్నాం అన్నా నువ్వు చూసే ఆ ఫోటో చూసి’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధికార తెలుగుదేశం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది.