జమిలి ఎన్నికల దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓటర్లు ప్రతి సంవత్సరం ఎన్నికలతో విసుగు చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
జమిలి ఎన్నికల ప్రయోజనాలు
రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ప్రతిపాదన 2029-30 నాటికి పూర్తిస్థాయిలో అమలు అయితే, ప్రతి ఏడాది ఎన్నికల కోసం ఓటర్లు పోలింగ్ బూత్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుందన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న జీడీపీకి అదనంగా మరో 1.5 శాతం పెరుగుతుందని స్పష్టం చేశారు. జమిలి ద్వారా ఎన్నికల అధిక ఖర్చులు తగ్గుముఖం పట్టడంతో పాటు పరిపాలనా వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 543 మంది సభ్యులున్న లోక్సభలో కేవలం 369 మంది సభ్యులే ఎలక్ట్రానిక్ ఓటింగ్లో పాల్గొనగా, కొన్ని సీట్లలో సాంకేతిక లోపాలు రావడంతో సభ్యులకు స్లిప్పులు అందజేశారు. మొత్తం ఓటింగ్ ముగిసే సమయానికి ఈ బిల్లుకు మద్దతుగా 269 మంది సభ్యులు నిలవగా.. వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో జమిలి బిల్లను ప్రవేశ పెట్టడానికి లోక్ సభ ఆమోదం తెలిపింది.