వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంత వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా ఇటీవలి పరిణామాలే అర్థం అవుతున్నాయి. ఆ దిశగానే నేడు జమిలి ఎన్నికలపై కీలక సమావేశం జరగనుంది. న్యూఢిల్లీలో ఇవాళ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటరీ జాయింట్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం రెండు సెషన్స్గా జరగనున్నట్లుగా సమాచారం.
వెబ్సైట్ ప్రారంభానికి రంగం సిద్ధం
ఈ సమావేశం అనంతరం, దేశవ్యాప్తంగా భిన్న భాషల్లో అందుబాటులో ఉండే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అధికారిక వెబ్సైట్ (Official Website) ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ (QR Code) సౌకర్యం ఉండే విధంగా రూపొందించారని తెలుస్తోంది. దీని ద్వారా ప్రజలకు సమాచారం సులభంగా అందుబాటులోకి రానుందని కేంద్రం భావిస్తోంది. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మరింత స్పష్టతను తీసుకురావడంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
భేటీలో న్యాయమూర్తులు..
జమిలిపై జరుగుతున్న సమావేశానికి సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా (Justice Hemant Gupta), డా. జస్టిస్ బి.ఎస్. చౌహన్ (Dr. Justice B.S. Chauhan), జమ్మూ కాశ్మీర్ హైకోర్టు (Jammu & Kashmir High Court) మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.ఎన్. ఝా (Justice S.N. Jha) లు హాజరవుతారు. ఇతర ప్రముఖులు కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నట్లు సమాచారం.