ఆంధ్రప్రదేశ్లోని(Andhra Pradesh) కూటమి ప్రభుత్వంపై (Coalition Government) జై భీమ్ రావు భారత్ పార్టీ (Jai Bhim Rao Bharat Party) అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ (Jada Shravan Kumar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గంజాయి (Cannabis) విచ్చలవిడిగా దొరుకుతున్నా ప్రజాప్రతినిధులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారని, రాష్ట్రాన్ని ఒక డ్రామా కంపెనీగా మార్చారని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడలో (Vijayawada) జరిగిన ప్రెస్మీట్లో ఆయన ప్రభుత్వంపై కీలక ప్రశ్నలను సంధించారు.
టీడీపీ (TDP) ఎంపీ(MP) పుట్టా మహేష్ యాదవ్ (Putta Mahesh Yadav) డ్రగ్స్ కేసులో దొరికిపోవడంపై శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎంపీ బ్లడ్ టెస్టులో డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది. ఇక బ్రహ్మదేవుడు దిగివచ్చినా ఆయనను కాపాడలేడు. దేశ చరిత్రలో ఒక సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్ కేసులో (Drugs Case) పట్టుబడటం ఇదే మొదటిసారి. పుట్టా మహేష్కు తన తండ్రి చేసిన పాపాలే శాపమై తగిలాయి” అని విమర్శించారు. తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో డ్రగ్స్ మాఫియా ఎంపీల అండతో సాగుతోందని, అందుకే ఈ కేసులు బయటకు రావడం లేదని ఆరోపించారు.
తిరుమల వివాదం.. బి.ఆర్. నాయుడిపై విమర్శలు
టీటీడీ (TTD) చైర్మన్ బి.ఆర్. నాయుడి (B.R. Naidu) నియామకంపై శ్రావణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. “32 ఏళ్లు సహజీవనం చేసిన బి.ఆర్. నాయుడికి వెంకటేశ్వర స్వామి శాపం తగిలింది. ఆయనను చైర్మన్గా కొనసాగించినంత కాలం స్వామివారు వదలడు. లౌకిక భావాలను వదిలేసి టీడీపీ నేతలు మతోన్మాదం బాట పట్టారు” అని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పందికొవ్వు కలిసింది అని లోకేష్ మాట్లాడటం దేవుడిని రాజకీయాలకు వాడటమేనని, ఇది వ్యవస్థలను నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
హెరిటేజ్ రాయితీలు.. పవన్ కల్యాణ్ హెలికాప్టర్లు
ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. హెరిటేజ్ సంస్థకు రాయితీలు ఇవ్వడం, ఇందాపూర్ ద్వారా నెయ్యి సప్లై చేస్తూ వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. 35 ఉద్యోగాల పేరుతో రూ.100 కోట్ల రాయితీలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. “పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా టికెట్లు 500 రూపాయలకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్లు సిద్ధంగా ఉంటున్నాయి. ఆయన వద్దన్నా నెలకు రూ.300 కోట్లు వచ్చి పడుతున్నాయి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.







