ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై ఆధికార దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ కమిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు ముఖ్య అధికారులు భాగమయ్యారు. ఈ కమిటీ సునీల్ కుమార్పై వచ్చిన ఆరోపణలపై సవివరంగా దర్యాప్తు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.
విచారణకు కారణం
సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో, ప్రజలలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సునీల్కుమార్పై అభియోగాలు నమోదయ్యాయి. ఆ అభియోగాలు సరైనవి కావని.. వాటిని కొట్టివేయాలని సునీల్కుమార్ విన్నవించగా, ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది.
2021 మే 14న రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. కస్టడీలో హతమార్చేందుకు యత్నించారంటూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు గతేడాది జూలై 11న ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ల కింద సునీల్కుమార్పై కేసు నమోదు చేశారు.