ముంబై నటి జెత్వానీపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు అధికారులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తులో సహకరించాల్సి ఉందని న్యాయస్థానం ఇద్దరు ఐపీఎస్ అధికారులకు సూచించింది. జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ,న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, వేములపాటి పట్టాభి, వినోద్కుమార్ దేశ్పాండే వాదనలు వినిపించారు.