ఐపీఎల్ 2026 ఫ్రాంచైజీ సేల్స్ బిజినెస్ షాక్

ఐపీఎల్ 2026 ఫ్రాంచైజీ సేల్స్ బిజినెస్ షాక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఫ్రాంచైజీల విక్రయాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి తన ఆర్థిక శక్తిని ప్రపంచానికి చూపింది. ఆర్ఆర్‌ను రూ.15,300 కోట్లకు ప్రముఖ టెక్‌ వ్యాపారవేత్త కల్‌ సోమని నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది. రూ.16,706 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, బోల్ట్‌ వెంచర్స్, బ్లాక్‌స్టోన్‌ సంస్థలు ఆర్‌సీబీని కైవసం చేసుకున్నాయి. ఈ ఒప్పందాలకు బీసీసీఐ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఐపీఎల్ 2026 అనంతరం ఆర్ఆర్, ఆర్‌సీబీలు కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఆర్ఆర్, ఆర్‌సీబీ ప్రాంచైజీల భారీ డీల్‌ల కారణంగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)కి భారీ ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది. రెండు జట్ల అమ్మకాల ద్వారా బీసీసీఐ దాదాపు 170 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,570 కోట్లు) ట్రాన్స్‌ఫర్ ఫీజుల రూపంలో పొందనుందని సమాచారం. ఆర్ఆర్, ఆర్‌సీబీల మొత్తం డీల్‌ విలువ సుమారు 3.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.32,000 కోట్లు)గా ఉంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. ఈ డీల్‌లలో ముఖ్యమైన అంశం ఏంటంటే.. 5 శాతం ట్రాన్స్‌ఫర్ క్లాజ్. ఫ్రాంచైజీలు యాజమాన్యం మారినప్పుడు ఆ మొత్తం విలువలో 5 శాతం బీసీసీఐకి వెళ్లే విధంగా నిబంధన అమల్లో ఉంది. ఈ క్లాజ్ కారణంగా బోర్డుకు అదనంగా భారీ ఆదాయం లభిస్తోంది.

ఇటీవలి కాలంలో ఐపీఎల్ గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్‌లో అత్యంత విలువైన లీగ్‌లలో ఒకటిగా ఎదిగిన నేపథ్యంలో.. ఇలాంటి భారీ డీల్‌లు సాధారణంగా మారుతున్నాయి. ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ, అభిమానుల ఆదరణ, మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయం.. అన్ని కలిపి ఐపీఎల్‌ను బంగారు గనిగా మార్చేశాయి. మొత్తంగా ఈ తాజా ఒప్పందాలు బీసీసీఐకి మాత్రమే కాదు.. భారత క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊతం ఇస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీ డీల్‌లు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment