డిజిటల్ అరెస్ట్ (Digital Arrests)ల పేరుతో సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) కొత్త దోపిడీకి తెరతీశారు. అమాయకులను బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు దోచుకుంటున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీస్లు (Bhimavaram Police) అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠాను బట్టబయలు చేశారు. ప్రపంచంలో వేగంగా “డిజిటల్ అరెస్టు” (Digital Arrest) పేరుతో పెరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాలకు భీమవరం పోలీసులు అడ్డుకట్ట వేసి పౌరుల మన్ననలు పొందుతున్నారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ను టార్గెట్ చేసిన ముఠా
భీమవరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ (Retired Professor) శర్మ (Sharma)కు నిందితులు సీబీఐ(CBI) అధికారులమని నటిస్తూ ఫోన్ చేశారు. “మీ సిమ్ కార్డు లో తేడా ఉంది… మేమే సరిచేస్తాం…” అంటూ మొదలైన ఈ కాల్, భయం కలిగేలా “డిజిటల్ అరెస్టు” చేస్తున్నామని బెదిరింపులతో కొనసాగింది. భయంతో శర్మ తమ ఆధార్, బ్యాంకు వివరాలు తెలియజేయడంతో 13 రోజుల్లోనే ఆయన ఖాతాలోని మొత్తం రూ.78 లక్షలు కాజేశారు.
శర్మ ఫిర్యాదు – పోలీసుల దర్యాప్తు వేగం
డిజిటల్ అరెస్ట్తో తాను మోసపోయానని బాధితుడు శర్మ క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసిన భీమవరం రెండో పట్టణ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి నిందితుల వేట ప్రారంభించారు. దర్యాప్తులో మొత్తం 14 మంది నిందితులను గుర్తించగా, అందులో 13 మందిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి, ముంబైకి చెందిన రహతే జె. నయన్ పరారీలో ఉన్నాడు.
స్కెచ్ ఇలా..
భారతీయుల బ్యాంకు ఖాతా వివరాలను స్థానిక నిందితులు సేకరిస్తారు. “కార్డ్ డీల్” (Card Deal) పద్ధతిలో ఈ డేటాను కంబోడియాకు పంపిస్తారు. అక్కడున్న అంతర్జాతీయ గ్యాంగ్ బాధితులకు డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్లు చేస్తుంది. భయపెట్టే పద్ధతిలో OTPలు, బ్యాంకు వివరాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత ఆ అకౌంట్లలోని డబ్బులు లాగేసుకుంటారు.
భీమవరం పోలీసులు భారీగా రికవరీ చేయడంలో సక్సెస్ అయ్యారు. రూ.42 లక్షల నగదు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.19 లక్షలు ఫ్రీజ్ చేసి, 15 మొబైల్ ఫోన్లు (అంతర్జాతీయ సిమ్తో) స్వాధీనం పరుచుకున్నారు. ఈ ఆపరేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలపై కట్టడి చేయడంలో ఒక మైలురాయిగా నిలిచింది.








