ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార పార్టీ ఆప్ 22 స్థానాలకు పరిమితమైంది. దీంతో బీజేపీ సంబరాలు చేసుకుంది. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా మహిళా నేతను ఎంపిక చేసింది. రేఖా గుప్తా ప్రమాణస్వీకారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఘనంగా జరిగింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఎన్డీయే కూటమిలోని ప్రముఖులంతా హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రమాణస్వీకార వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, డిప్యూటీ సీఎం పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
పవన్ దీక్షా వస్త్రాలు ధరించి హాజరయ్యారు. అందరినీ పలకరిస్తూ పవన్ వద్దకు వచ్చిన మోడీ ఆయనతో సరదాగా మాట్లాడారు. దీనిపై నేషనల్ మీడియా ప్రశ్నించగా, హిమాలయాలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా..? అని తనను మోడీ అడిగారని, హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా టైమ్ ఉందని చెప్పానని సమాధానం ఇచ్చారు.