ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గిరిజన పాఠశాల (Tribal School)లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కురుపాం (Kurupam) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో (Ekalavya Model Residential School) చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని ఏకంగా 7 నెలల గర్భవతి అని బయటపడడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ(YSRCP) నేత పాముల పుష్పశ్రీ వాణి (Pamula Pushpa Sreevani) బయటపెడుతూ సంచలన ట్వీట్ చేశారు.
“దేవుడా… ఇదేం దారుణం!” అంటూ ట్వీట్ చేసిన పుష్పశ్రీ వాణి, ఏడు నెలలుగా విద్యార్థిని గర్భవతి (Pregnant)గా ఉన్నా పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, వైద్య సిబ్బంది ఎవరికీ ఇది గుర్తించకపోవడం విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులంలో జరగడం మరింత బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
మంత్రి సంధ్యారాణి నెలరోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖలోని ప్రతి గురుకులంలో ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారని గుర్తు చేసిన పుష్పశ్రీ వాణి, ఆ ప్రకటన పూర్తిగా పచ్చి అబద్ధమని ఈ ఘటనతోనే రుజువైందన్నారు. నిజంగా నెలనెలా హెల్త్ స్క్రీనింగ్ జరిగితే, 7 నెలల గర్భాన్ని ఎందుకు గుర్తించలేకపోయారని ఆమె ప్రశ్నించారు.
గిరిజన విద్యార్థుల భద్రత, పర్యవేక్షణ, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని పుష్పశ్రీ వాణి ఆరోపించారు. గురుకులాల్లో నిర్వహణ దారుణంగా ఉందని మరోసారి నిరూపితమైందని, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, విద్యార్థిని భద్రతకు భరోసా కల్పించాలని ఆమె కోరారు. మరి దీనిపై గిరిజన మంత్రి, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.








