ఇండిగో (IndiGo) కృత్రిమ సంక్షోభం వల్ల భారతదేశంలోని ఎయిర్ బస్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశంలోని ఏ ఎయిర్పోర్ట్ (Airport)లో చేసినా ప్రయాణికులు (Passengers) కుప్పలుగా కనిపిస్తున్నారు. సమస్య రోజు రోజుకూ జఠిలమవుతుండగా, అసలు దీనికి బాధ్యులు ఎవరూ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సంబంధిత మంత్రిత్వ శాఖ ఏం పనిచేస్తోందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇండిగో విమానయాన సంస్థలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా సోమవారం సైతం దేశవ్యాప్తంగా భారీగా విమానాలు (Flights) రద్దయ్యాయి (Cancelled). ఒక్కరోజులోనే 300కు పైగా ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
అధికారిక సమాచారం ప్రకారం, ఢిల్లీ విమానాశ్రయంలో 134 విమానాలు రద్దయ్యాయి. వాటిలో 75 డిపార్చర్లు, 59 అరైవల్స్ ఉన్నాయి. బెంగళూరులో పరిస్థితి మరింత తీవ్రమైంది. మొత్తం 127 ఫ్లైట్లు రద్దయ్యాయి. చెన్నైలో 71, హైదరాబాద్లో 77, జైపూర్లో 27 విమానాలు రద్దయ్యాయి.
ఇండిగో ఇప్పటికే ప్రయాణికులకు రూ.610 కోట్ల మేర రిఫండ్లు ప్రాసెస్ చేసినట్లు ప్రకటించింది. అలాగే, డిసెంబర్ 15 వరకు అన్ని రద్దులు, రీషెడ్యూలింగ్పై పూర్తి వేవర్ అందుబాటులో ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభం పూర్తిగా సాధారణ స్థితి చేరుకోవడానికి డిసెంబర్ 10వ తేదీ వరకు పట్టొచ్చని ఆ కంపెనీ అంచనా వేస్తోంది.
ఇక DGCA ఇండిగోకు ఇచ్చిన షో-కాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి అదనంగా 24 గంటల గడువు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని DGCA కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విమానయాన వర్గాలు సూచిస్తున్నాయి.








