భారతదేశం (India)లో రోడ్డు ప్రమాదాల (Road Accidents) సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినవారిపై భారీ జరిమానాలు (Heavy Fines) విధిస్తోంది. 2024లో దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా ట్రాఫిక్ చలాన్లు జారీ అయ్యాయి, వీటి మొత్తం విలువ సుమారు ₹12,000 కోట్లుగా అంచనా. ఈ గణాంకాలు నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టం చేస్తున్నాయి.
ఢిల్లీ, గురుగ్రామ్లలో అధిక ఉల్లంఘనలు
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజూ 5,000 కంటే ఎక్కువ ఈ-చలాన్లు ఓవర్ స్పీడ్, రెడ్-లైట్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ఉల్లంఘనలకు జారీ చేస్తున్నారు. గురుగ్రామ్ (Gurugram)లో కూడా ఈ సంఖ్య గణనీయంగా ఉంది.
సాధారణ ఉల్లంఘనలు, భారీ జరిమానాలు
మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఎక్కువగా జరిమానాలు విధించే ఉల్లంఘనలలో కొన్ని:
హెల్మెట్ ధరించకపోవడం (₹1,000 జరిమానా)
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం
ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం
అతి వేగం (₹2,000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానా)
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడడం
రెడ్ లైట్ జంపింగ్
రాంగ్ లేన్లో డ్రైవింగ్ చేయడం
మొదటిసారి నిబంధన ఉల్లంఘించినవారికి కొన్ని నగరాల్లో తక్కువ జరిమానా విధించినప్పటికీ, అదే తప్పును పదే పదే చేస్తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏఐ టెక్నాలజీతో తప్పించుకోవడం అసాధ్యం
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సహాయంతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడం చాలా సులభమైంది. ఏఐ కెమెరాలు హై-రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేస్తాయి. వీటి ఆధారంగానే వాహనదారులకు నేరుగా చలాన్లు జారీ అవుతాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ట్రాఫిక్ నియమాలు అతిక్రమించి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, నిబంధనలు పాటించడం అత్యవసరం.