హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు! ఒకే వ్యక్తికి 880

హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు! ఒకే వ్యక్తికి 880

భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ ఆసీస్ సిరీస్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ, మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.

రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయం
అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా జరిగే మూడో వన్డే, అక్టోబర్ 29న కాన్‌బెరాలో జరిగే తొలి టీ20కి టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. రెండు వారాల వ్యవధిలో మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లకు సంబంధించిన 90 వేల టికెట్లను విక్రయించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అమ్ముడైన టికెట్లలో 16 శాతం భారత అభిమాన సంఘాలే కొన్నాయని సీఏ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే, అభిమానుల్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లకు ఎంత క్రేజ్ ఉందో స్పష్టమవుతోంది.

ఒక్కడే 880 టికెట్లు కొన్న అభిమాని!
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ల కోసం ఇండియా ఆర్మీ అనే భారత అభిమాన సంఘం 2400 టికెట్లను కొనుగోలు చేయగా, మరో అభిమానుల బృందం ఫ్యాన్స్ ఇండియా 1400 టికెట్లను బుక్ చేసుకుంది. వీటన్నిటినీ మించి, బ్రిసి బనియాస్ ఫ్యాన్ క్లబ్ సభ్యుడు అమిత్ గోయల్ గబ్బాలో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం ఒక్కడే ఏకంగా 880 టికెట్లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఒకే మ్యాచ్‌కు అత్యధిక టికెట్లు కొనుగోలు చేసిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో చేరాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ టికెట్ల అమ్మకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను చూసేందుకే ఎక్కువ మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ అభిమానుల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ టికెట్ల విక్రయం మరోసారి నిరూపించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment