ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా నివాసానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెళ్లారు. మార్చి 8న లండన్లో భారీ స్థాయిలో నిర్వహించనున్న ఓర్కెస్ట్రా ప్రదర్శనను పురస్కరించుకుని, స్టాలిన్ స్వయంగా వెళ్లి ఇళయరాజాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి, కాసేపు అనుభవాల గురించి ముచ్చటించారు. ఈ అపురూప క్షణాల వీడియోను సీఎం స్టాలిన్ తన ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
స్టాలిన్ మాట్లాడుతూ.. ఇళయరాజా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజల సంగీత శ్వాస అని కొనియాడారు. ఆసియాలో ఇంతవరకు ఎవరూ చేపట్టని విధంగా సింఫనీ ప్రదర్శనకు ముందుకొచ్చిన ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇళయరాజా తన చేతిరాతలో ఉన్న సంగీత నోట్స్ను సీఎంకు చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
இசைஞானி இளையராஜாவுடன் இன்றைய காலைப் பொழுது 🎼🎼
— M.K.Stalin (@mkstalin) March 2, 2025
ஆசியாவிலேயே யாரும் செய்யாத சாதனையாக, வரும் மார்ச் 8 அன்று இலண்டன் மாநகரில் சிம்பொனி அரங்கேற்றத்தை நிகழ்த்தவுள்ளார் நம் மனதிற்கினிய ராஜா அவர்கள். தமிழ்நாட்டின் பெருமிதமான இசைஞானியின் இச்சாதனை முயற்சியை வாழ்த்துவதற்காக இன்று நேரில்… pic.twitter.com/bv9AUVxpl0
సీఎం స్టాలిన్పై ఇళయరాజా ప్రశంసలు
సీఎం స్టాలిన్ స్వయంగా తన ఇంటికి వచ్చి కలవడం పట్ల ఇళయరాజా ఆనందం వ్యక్తం చేశారు. బిజీ షెడ్యూల్లోనూ కొంత సమయం వెచ్చించి తనను కలిసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. స్టాలిన్ పోస్ట్ను రీట్వీట్ చేస్తూ, సంగీతం పట్ల ఆయన చూపించిన ప్రేమ, అభిమానం తనను ఎంతో సంతోషపరిచాయని చెప్పారు.
తమిళ భాష కోసం స్టాలిన్ పోరాటం
ఇదే సమయంలో, జాతీయ విద్యావిధానం (NEP)లో భాగంగా త్రిభాషా విధానాన్ని అమలు చేయడంపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదం కొనసాగుతోంది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని అమెరికాలోని తమిళులు చేపట్టిన నిరసనల వీడియోలను స్టాలిన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తమిళ భాష వర్ధిల్లాలని ఆకాంక్షించారు.