వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఇబ్రహీంపట్నం పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం, రాడ్లు–కర్రలతో దాడి చేసిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బదులు, డమ్మీ కేసులు నమోదు చేసి నిందితులను వెంటనే స్టేషన్ బెయిల్పై విడుదల చేయడంపై వైసీపీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జోగి రమేష్ ఇంటిపై దాడి ఈ ఘటనకు సంబంధించి 40 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసినప్పటికీ, కొద్దిసేపటికే వారిని బెయిల్పై విడిచిపెట్టారు. ఇంటిపై దాడి చేసి నిప్పంటించడం, ఆయుధాలతో దాడులు చేయడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నా కూడా నిందితులపై కఠిన సెక్షన్లు నమోదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పెట్రోల్ బాంబులు విసిరినా, రాడ్లు–కర్రలతో దాడి చేసినా పోలీసులు చూపిన సడలింపు వైఖరి రాజకీయ ఒత్తిళ్ల కారణమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అరెస్టైన వారిలో టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశతో పాటు పలువురు ఉన్నారు. వీరంతా విజయవాడ నగరం నుంచి ప్రత్యేకంగా జోగి రమేష్ ఇంటిపై దాడికి వెళ్లినట్టుగా వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, పోలీసులు సరైన దర్యాప్తు చేయకుండా, చట్టాన్ని తేలికగా తీసుకున్నట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ మొత్తం ఘటనలో పోలీసుల తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో న్యాయం జరుగుతుందా? పోలీసుల చర్యలపై ఉన్న అనుమానాలకు సమాధానం దొరుకుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్యుల్లో చర్చనీయాంశంగా మారాయి.







