ఇది పిచ్చి అనాలా, వెర్రి అనాలా లేక ఇంకేదైనా అనాలా? రోడ్డుపై వెళ్లాల్సిన కారు ఏకంగా రైల్వే ట్రాక్పై దూసుకెళ్లింది. ఓ యువతి అలాంటి దుస్సాహసానికి పాల్పడింది. రైలు పట్టాలపై హైస్పీడ్తో కారు నడుపుతూ హల్చల్ చేయడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు సరైన సమయంలో గమనించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఆ ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయంగా ఉంది.
హైదరాబాద్లో ఘటన
రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ యువతి అందరినీ భయాందోళనకు గురి చేసింది. దీంతో రైళ్లను సైతం ఆపేశారు. నాగులపల్లి వద్ద యువతి కారును గమనించిన స్థానికులు అడ్డగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో పట్టాలపై కారును గుర్తించిన లోకోపైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ఆ మార్గంలో నడిచే రైళ్లు గంటలసేపు నిలిచిపోయాయి.
పోలీసుల అదుపులో యువతి
స్థానికులు ఎంత అరుస్తున్నా వినిపించుకోకుండా ఆ యువతి వేగంగా ట్రాక్పై దూసుకెళ్లింది. కొంతదూరం వెళ్ళాక కారు ఆగిపోవడంతో స్థానికులు ఆ యువతిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాము అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా యువతి మౌనంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఆ యువతిని చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కారు నడిపిన ఈ యువతి ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన రబిక సోనీగా గుర్తించారు. శంకర్పల్లి పోలీసులు ఆమెను వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించనున్నారు. ఆమె మద్యం లేదా డ్రగ్స్ సేవించిందా, లేక ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతోందా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.