హనీ ట్రాప్‌లో 70 ఏళ్ల‌ రిటైర్డ్ ఉద్యోగి.. రూ.38.73 లక్షలు చోరీ

హనీ ట్రాప్‌లో 70 ఏళ్ల‌ రిటైర్డ్ ఉద్యోగి.. రూ.38.73 లక్షలు చోరీ

70 ఏళ్ల వ‌య‌స్సులో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి (Retired Government Employee) హ‌నీ ట్రాప్‌ (Honey Trap)లో చిక్కుకున్నారు. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన సీనియ‌ర్ సిటిజ‌న్‌ సైబర్ నేరగాళ్ల హనీ ట్రాప్‌లో చిక్కుకుని ఏకంగా రూ.38.73 లక్షలు కోల్పోయిన సంఘ‌ట‌న గ్రేట‌ర్ న‌గ‌రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫేస్‌బుక్‌ (Facebook)లో మహిళ పేరు(Women Name)తో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ (Friend Request)తో మొదలైన ఈ మోసం, బాధితుడిని ఆర్థికంగా, మానసికంగా నాశనం చేసింది. సైబర్ నేరగాళ్లు మహిళ, కేబుల్ ఆపరేటర్, పోలీస్ అధికారుల పేరుతో నాటకీయంగా మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ సైబర్ క్రైమ్ (Hyderabad Cyber Crime) పోలీసుల(Police) దృష్టికి రాగా, విచారణ ప్రారంభమైంది.

వివ‌రాల్లోకి వెళితే.. బాధితుడు ఫేస్‌బుక్‌లో మహిళ నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయ‌డంతో ఈ మోసానికి రంగం సిద్ధ‌మైంది. ఆమె తన తండ్రి వదిలేసి వెళ్లిపోయాడని, తల్లి టైలర్‌గా పనిచేస్తోందని చెప్పి సానుభూతి పొందింది. చాటింగ్ కోసం ఇంటర్నెట్ సదుపాయం కావాలని చెప్పి, ఒక కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. బాధితుడు ఆ నంబర్‌తో మాట్లాడి రూ.10,000 పంపారు. అనంతరం మహిళ ఫేస్‌బుక్‌లో స్పందించకపోవడంతో, ఆయన కేబుల్ ఆపరేటర్‌ (Cable Operator)తో చాటింగ్ కొనసాగించారు. మహిళ జబ్బు పడి ఆస్పత్రిలో ఉందని చెప్పిన ఆపరేటర్, ఆమె చికిత్స కోసం రూ.10 లక్షలు, క్రెడిట్ కార్డు(Credit Card) ద్వారా మరో రూ.2.65 లక్షలు బాధితుడి నుంచి రాబట్టాడు. ఆ తర్వాత మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని, ఆమె కాంటాక్ట్‌లు లేవని ఆపరేటర్ తెలిపాడు. అయితే, తన తల్లి, సోదరితో బాధితుడు మాట్లాడాలని సూచించాడు. కొన్ని రోజుల పాటు వారితో లైంగిక సంభాషణలు జరిపిన బాధితుడిని, ఆపరేటర్ మైనర్ సోదరితో అసభ్యంగా చాటింగ్ చేశావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు.

ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ పేరుతో సందేశాలు వచ్చాయి. కేసు అవకుండా సెటిల్ చేయడానికి బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు కోసం రూ.12.5 లక్షలు, కానిస్టేబుల్, ఎస్‌ఐకి రూ.1 లక్ష చెల్లించారు. కొత్త ఎస్‌ఐ వచ్చానని చెప్పిన మరో వ్యక్తి, కేసు అవకుండా రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, బాధితుడు రూ.7 లక్షలు పంపారు. ఇలా మొత్తం రూ.38.73 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. ఈ మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా cybercrime.gov.inలో తక్షణ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment