హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు దేశవ్యాప్తంగా వివిధ నేరాల్లో పాల్గొని మొత్తం రూ.5.29 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. .
విలేకరుల సమావేశంలో డీసీపీ కవిత సైబర్ ముఠా వివరాలను వెల్లడించారు. సైబర్ నేరాలు చేస్తున్న ఈ ముఠాను యూపీలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 5 ప్రత్యేక బృందాలు సాయంతో, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. అరెస్టు అయిన 23 మంది సైబర్ నేరగాళ్లపై తెలంగాణలో 30 కేసుల నమోదయ్యాయని, దేశ వ్యాప్తంగా 328 కేసులు నమోదు అయ్యాయని, వీరు రూ.5.29 కోట్లు దోపిడీ చేశారని డీసీపీ కవిత చెప్పారు. ఈ నేరాల్లో ఒక మహిళ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. 70 ఏళ్ల వృద్ధుడి ఫిర్యాదుతో ఆమెను కూడా అరెస్టు చేశారు.
ప్రజలకు అలర్ట్:
అనుమానిత కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించ వద్దని, వాటిని అనుసరిస్తే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయం అవుతాయని, అపరిచిత కాల్స్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కవిత సూచించారు.