హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు (Passengers) త్వరలోనే షాకింగ్ వార్త వినిపించనుంది. మెట్రో రైల్ టికెట్ ఛార్జీలు (Ticket Charges) పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల వివరాల ప్రకారం.. మే రెండో వారంలో కొత్త టికెట్ రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) గ్రూప్ ఛైర్మన్ అమెరికా పర్యటనలో ఉండగా, ఆయన తిరిగి భారత్కు వచ్చిన తర్వాతే ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ కొత్త టారిఫ్ (New Tariff) సవరణలతో ఏటా అదనంగా రూ.150 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఛార్జీలు పెంచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ ధర రూ.10 కాగా, గరిష్ఠ టికెట్ ధర రూ.60 ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ గరిష్ఠ ఛార్జీని రూ.75 వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థకు టికెట్ అమ్మకాలతో పాటు, ప్రకటనలు, షాపింగ్ మాల్స్ అద్దె వంటివి ద్వారా ఏటా సుమారు రూ.1500 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ మెట్రో నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, బ్యాంక్ రుణాల వడ్డీ వంటివి కలిపి సంస్థకు ఏటా సుమారు రూ.2000 కోట్ల వ్యయం జరుగుతుండటంతో, ఈ టికెట్ ఛార్జీ పెంపు ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.