హైదరాబాద్ మెట్రో రెండో దశలో సరికొత్త విస్తరణ ప్రణాళికలు అమలు కానున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే, నగరంలోని ఉత్తర భాగం శామీర్పేట్, మేడ్చల్ ప్రాంతాలు నేరుగా దక్షిణ భాగంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో కలవనున్నాయి. ఈ విస్తరణతో మొత్తం మెట్రో పొడవు 230.4 కిలోమీటర్లకు చేరుకోవడం విశేషం.
విస్తరణ ప్రణాళికలు..
మొదటి దశలో 69 కిలోమీటర్ల మేర పనిచేస్తున్న మెట్రో, రెండో దశలో 190.4 కిలోమీటర్లు విస్తరించనుంది. ప్రతిపాదిత నార్త్సిటీ కారిడార్లతో పాటు 40 కిలోమీటర్ల నూతన మార్గాలను కూడా చేర్చారు. ఈ విస్తరణతో మెట్రో, చెన్నై మరియు బెంగళూరు మెట్రోల సరసన చేరనుంది.
ప్రయాణికులకు కొత్త కనెక్టివిటీ..
శామీర్పేట్ నుండి ఎయిర్పోర్టు వరకు.. 62 కిలోమీటర్ల కారిడార్ ప్యారడైజ్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్టు చేరుకుంటుంది. మేడ్చల్ నుండి.. 63 కిలోమీటర్ల రూట్ ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం. సికింద్రాబాద్ నుండి ఉప్పల్, నాగోల్ మీదుగా మెట్రో మార్గాలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంచుతాయి.
తూర్పు-పడమరల కనెక్టివిటీ
హయత్నగర్ నుంచి పటాన్చెరు వరకు సుమారు 50 కిలోమీటర్ల కొత్త కారిడార్ ప్రయాణికులకు విపరీతమైన ప్రయోజనం అందించనుంది. ప్రస్తుతం ఎల్బీనగర్ నుండి మియాపూర్ వరకు 29 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రోను పటాన్చెరు మరియు హయత్నగర్ వరకు పొడిగించనున్నారు.
ప్రత్యామ్నాయ రవాణాకు గుడ్బై
నాలుగు వైపులా విస్తరించే మెట్రోతో ప్రయాణికులు ఇక ప్రత్యామ్నాయ రవాణా పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. 2028 నాటికి 8 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించగల ఈ మెట్రో 2030 నాటికి 15 లక్షల మంది సౌకర్యాన్ని అందించనుంది.








