హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు అర్నవ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అత్యవసరంగా నీలోఫర్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచాడు.
ఘటన వివరాలు
ఫిబ్రవరి 21న అజయ్ కుమార్ కుమారుడు అర్నవ్ (6) తన తాతతో కలిసి శాంతినగర్లోని మేనత్త ఇంటికి వెళ్లాడు. పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ బటన్ నొక్కిన సమయంలో, లిఫ్ట్ డోర్ – గోడ మధ్యలో అతడు ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయాడు. అపార్ట్మెంట్ వాసులు విషయం గమనించి పోలీసులు, DRF బృందానికి సమాచారం అందించారు. రెండు గంటల పాటు శ్రమించి DRF సిబ్బంది బాలుడిని బయటకు తీశారు.
తీవ్రంగా గాయపడిన బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ స్థితిలోకి వెళ్లిన అతడు, చివరికి వైద్యుల కృషిని వృథా చేస్తూ తుది శ్వాస విడిచాడు. బాలుడి మరణంతో అజయ్ కుమార్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.








