అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, సురక్షితమైన భౌగోళిక స్థానం కారణంగా హైదరాబాద్ (Hyderabad) ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు (Global Investors) ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (A. Revanth Reddy) తెలిపారు. ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) ఆయన ప్రసంగించారు.
దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ (Telangana) నిలిచిందని సీఎం అన్నారు. గత 35 ఏళ్లుగా ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు మద్దతుగా నిలిచారని, అందువల్ల భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు.
భారత్ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న తన లక్ష్యాన్ని USISPF సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ నదీ పునరుజ్జీవనం ద్వారా లండన్, దుబాయి తరహా నైట్ ఎకానమీ కొత్త దశలోకి హైదరాబాద్ ప్రవేశిస్తుందని సీఎం అన్నారు.
డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్ వంటి అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెడతామని ఆయన తెలిపారు. హార్వర్డ్ వంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానించారు.







