నూతన ఇళ్లు నిర్మించుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందించడంతో పాటు సిమెంట్, ఇసుక, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందజేయాలని నిర్ణయించింది.
సమగ్ర ఆర్థిక సహాయం..
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం లబ్ధిదారులకు నచ్చే విధంగా చర్యలు తీసుకుంటోంది. సిమెంట్ ప్రస్తుత మార్కెట్ ధర బస్తాకు రూ.260గా ఉండగా, ప్రభుత్వం తక్కువ ధరకు అందించనుంది. టన్నుకు రూ.54 వేల వరకు ఉన్న స్టీల్ ధరను తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ఇసుక ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణలో ఉండటంతో, అందుబాటులోకి తక్కువ ఖర్చుతో ఇసుకను అందించనున్నారు. ఈ చర్యలతో లబ్ధిదారులు సౌకర్యవంతంగా ఇల్లు నిర్మించుకునేలా చేయడం, అధిక ఖర్చులు తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.