మేఘాలయలో అదృశ్యమైన కొత్త జంట ఉదంతం లెక్కలేనన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ చెబుతున్న విషయాలు పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి. సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి తన భర్తను హత్య చేయడానికి ముందుగానే ప్లాన్ చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల వివరాల ప్రకారం, సోనమ్ తన భర్తను ఈశాన్య రాష్ట్రానికి తీసుకువెళ్లి అంతమొందించాలని పథకం రచించిందని పోలీసులు తెలిపారు.
కామాఖ్య ఆలయం నెపంతో హత్యకు ప్లాన్
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోనమ్ ముందుగా రాజా రఘువంశీని కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు ఒప్పించింది. రాజాను తొలుత గౌహతికి, ఆపై మేఘాలయకు తీసుకెళ్లాలని సోనమ్ ప్లాన్ చేసింది. వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత, మే 15న సోనమ్ తన పుట్టింటికి వచ్చినప్పుడు రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ తన ప్రియుడు రాజ్కు ఫోన్ చేసి, హత్యకు సంబంధించిన ‘ప్రణాళిక’ను సిద్ధం చేసిందని పోలీసులు తెలిపారు. ఇండోర్లో మేఘాలయ పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా విచారించినప్పుడు ఈ ఉదంతంలో సోనమ్ ప్రమేయం స్పష్టంగా వెల్లడయ్యింది.
‘ప్లాన్ బీ’: కొండ పైనుంచి తోసేయడం!
హత్యకు సంబంధించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు విశాల్, ఆనంద్, ఆకాష్లు రాజా రఘువంశీని చంపడంలో విఫలమైతే, తాను ఫోటో తీయాలనే నెపంతో భర్తను కొండ అంచునకు తీసుకెళ్లి, అక్కడి నుంచి అతన్ని తోసేస్తానని సోనమ్ తన ప్రియునితో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకవేళ నేరం బయటపడితే సోనమ్, రాజ్లు నేపాల్కు పారిపోయేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా, రాజా రఘువంశీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుని హత్యలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ ఉరితీయాలని డిమాండ్ చేశారు. వారిలో సోనమ్ కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలోని వారు కూడా ఉన్నారని ఆరోపించారు. సోనమ్ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించాలని కూడా ఆయన కోరారు.