దేశవ్యాప్తంగా HMPV వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కీలక సూచనలు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయంపై భక్తుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి నివారించేందుకు ప్రతి భక్తుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కు కర్చీఫ్ లేదా చేతితో కవర్ చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మందితో కూడిన ప్రదేశాల్లో అవసరం లేకుండా తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు
HMPV వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జనవరి 10 నుండి 19 వరకు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ ప్రకటించింది. భక్తులు స్వీయరక్షణ పాటించడం ద్వారా తమ ఆరోగ్యం కాపాడుకోవచ్చని సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 గంటలకు మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగింపు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో భక్తులకు ఉత్సవమూర్తులు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేసిన 91 కౌంటర్ల ద్వారా 1.2 లక్షల దర్శన టోకెన్లు జారీ చేశామన్నారు.
ప్రత్యేక దర్శనాలు, సేవల రద్దు
జనవరి 10 నుంచి 19 వరకు ప్రధానాలయంలో ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలతో కూడిన ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాల అవకాశం ఉంటుందన్నారు.