శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రౌడీషీటర్ నాగేంద్రపై పోలీసులు కాల్పులు జరిపారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం, రౌడీషీటర్ నాగేంద్రను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో అతడు సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పోలీసులు గాయపడగా, ఆ తర్వాత నాగేంద్ర అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ చర్యగా సీఐ ఆంజనేయులు నాగేంద్రపై కాల్పులు జరిపినట్లుగా సమాచారం. కాల్పుల్లో నాగేంద్ర కాలికి బుల్లెట్ దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన నాగేంద్రను అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రౌడీషీటర్ నాగేంద్రపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి దాదాపు 90కు పైగా కేసులు నమోదయ్యాయి. గతంలో హిందూపురంలో సంచలనం సృష్టించిన అత్తా–కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో కూడా నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన నేపథ్యంలో హిందూపురం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) February 6, 2026
బాలకృష్ణ ఇలాకాలో కాల్పుల కలకలం
రౌడీషీటర్ నాగేంద్రపై కాల్పులు జరిపిన సీఐ ఆంజనేయులు
రౌడీషీటర్ నాగేంద్ర కాలిలో దూసుకెళ్లిన బుల్లెట్
సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిలపై కత్తితో దాడి చేసిన రౌడీషీటర్ నాగేంద్ర
పారిపోతున్న రౌడీషీటర్ నాగేంద్రపై కాల్పులు… pic.twitter.com/hxOCgB1ejZ








