సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఓ పక్క కోడి పందెం బరులు సిద్ధం అవుతుంటే.. మరోపక్క రోడ్లన్నీ ట్రాఫిక్తో కిటకిటలాడుతున్నాయి. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గ్రేటర్లో నివసించే ఏపీ ప్రజలంతా సొంతూళ్లకు పయనమయ్యారు. మరో వైపు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అదనపు బస్సులు నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల రద్దీకి ఆ రైళ్లు, బస్సు ఏమాత్రం సరిపోవడం లేదు. స్వంత వాహనాల్లో బయల్దేరిన ప్రజలకు ట్రాఫిక్ జామ్లు తలనొప్పిగా మారాయి.

భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై, చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి, కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు మరియు నేషనల్ హైవే అథారిటీ ఫోర్స్ (NHAI) ట్రాఫిక్ క్లియర్ చేయడానికి రంగంలోకి దిగారు. అలాగే, అమీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ జామ్ అయి, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆలస్యంగా రైళ్లు..
సంక్రాంతి పండగ సందర్భంగా నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ గంటల తరబడి ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. అతికష్టంగా బెర్తులు సంపాదించి రైలెక్కినా గంటల తరబడి పట్టాలపైనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు మధ్యాహ్నం 12 దాటినా విశాఖకు చేరుకోలేకపోయామని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.