తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. గతేడాది బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేసి మళ్లీ చదివారని, కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి చేసిన సేవ ఏమీలేదని ధ్వజమెత్తారు.
మహిళా సంఘాలకు రూ. 1 లక్ష కోట్ల వడ్డీ రహిత రుణాలంటూ చెప్పి, కేవలం రూ. 5 లక్షల రుణాలకు మాత్రమే వడ్డీ మాఫీ చేసినట్లు తెలిపారు. మిగిలిన రుణాలకు 12% వడ్డీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 4000 పెన్షన్ల గురించి అసలు చర్చ లేకపోవడం, కొత్తగా ఒక్కరికీ కూడా ఇవ్వకపోవడం, ఉన్నవే తొలగించడం అభ్యంతరకరమని అన్నారు. ఆడపడుచుల కోసం రూ. 2500 ఇవ్వాలని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఆ పథకాన్ని విస్మరిస్తూ అందాల పోటీలకు రూ. 250 కోట్లు కేటాయించారని విమర్శించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని, వాస్తవంగా వేలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీ అందలేదని ధ్వజమెత్తారు. గత బడ్జెట్లో 6 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కటీ పూర్తి చేయలేదని, ఈసారి మళ్లీ 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటూ మరోసారి హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర స్థితిగతులు దిగజార్చింది..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు (GSDP) 12% నుండి 10%కి పడిపోయిందని, తలసరి ఆదాయం 12.4% నుండి 9%కి తగ్గిందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల ఆదాయం గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. అంతేగాక, ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి అప్పుల గురించి విమర్శలు చేస్తే, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో 5 వేల కోట్ల మిగులు ఆదాయం ఉందని ప్రకటించడం ఐరోనీక్గా మారిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.