తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రగులుకుంది. మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్రావు రేవంత్ రెడ్డి పై పలు ఆరోపణలు చేశారు.
హరీష్రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీఎం అయినా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మహిళా దినోత్సవ సభలో రూ. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క స్పష్టంగా రూ. 5 లక్షల వరకే వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నామని చెప్పినా, మహిళా దినోత్సవం సభలో రేవంత్ తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారని హరీష్రావు అన్నారు.
“అబద్ధాలకు అంగిలాగు వేస్తే అది రేవంత్ రెడ్డి లాగానే ఉంటుంది” అంటూ హరీష్రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళల కోసం బట్టల కుట్టడానికి ప్రభుత్వం రూ. 75 ఇస్తోందని చెప్పినా, వాస్తవానికి రూ. 50 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. మహిళలను మోసం చేస్తున్న ఈ తప్పుడు హామీలపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చెక్కుల్లోనూ మోసం?
స్వయం సహాయక బృంద సభ్యుల మరణంపై ఇచ్చే చెక్కుల్లో కూడా ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోందని హరీష్రావు ఆరోపించారు. వరంగల్లో ఇచ్చిన రూ. 35 కోట్ల చెక్ పాస్ కాకపోవడంతో, మరో రూ. 9 కోట్లు కలిపి కొత్త చెక్ ఇచ్చారని తెలిపారు. కానీ అది కూడా పాస్ అవుతుందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ లేదని, మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజలకు నిజాలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని హరీష్రావు డిమాండ్ చేశారు.