హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ (Indira Park Dharna)లో ఆర్ఎంపీ, పీఎంపీలు (RMP PMP Protest) తమ హక్కుల కోసం మహా ధర్నా చేపట్టారు. వైద్యుల నిరసనకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీ, పీఎంపీలపై ఎలాంటి కేసులు లేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వారిని వేధిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ట్రైనింగ్, సర్టిఫికెట్ ఇస్తామన్నారు గానీ, ఇప్పుడు వీరిని రోడ్లపైకి నెట్టేశారని మండిపడ్డారు. ఆరోగ్యశాఖ అధికారులు ఆర్ఎంపీ, పీఎంపీలను వేధింపులకు గురిచేయడం ఆపాలని, ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే స్పందించాలని కోరారు.
ఆ పథకాలన్నీ నీరుగార్చారు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు కష్టాల్లో కూరుకుపోయాయని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేదని ఆరోపించారు. గతంలో అమలు చేసిన రైతు బంధు, బతుకమ్మ చీరలు, ఫీజు రీయింబర్స్మెంట్, కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఎవర్ని కదిలిచ్చినా దుఃఖమే ఉంది. కాంగ్రెస్ది అంతా మాటల గారడీ, అంకెల గారడీ అని ప్రజలకు అర్థమైందన్నారు.
ఓటుతో నిరసన తెలపండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని, ఆర్ఎంపీ, పీఎంపీలు తమ ఓటుతో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే ఆర్ఎంపీ, పీఎంపీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.