తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు, ఇప్పుడు నీటిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటున్నామని, రెండు రాష్ట్రాలు రెండు కళ్లలా చూడాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు.
రేవంత్ నిర్లక్ష్య ధోరణి, కేంద్రంలో బీజేపీ పక్షపాత వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదన్నారు. ఢిల్లీని చూస్తే భయపడే రేవంత్, చంద్రబాబు పట్ల గురుదక్షిణ భక్తితో ఉంటున్నారన్నారు. ఇది తెలంగాణకు తీవ్ర అన్యాయం అని హరీష్రావు తీవ్రంగా స్పందించారు.
చంద్రబాబుకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అయితే, నాగార్జున సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, కుడి కాల్వ నుంచి పూర్తిగా నీటిని తరలించడం ఏమిటి? ఇదేనా సమన్యాయం? అని హరీష్రావు నిలదీశారు. కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన వాటా ప్రకారం 512 టీఎంసీలు రావాల్సి ఉండగా, 655 టీఎంసీలు నీటిని వాడారని, తెలంగాణకు 343 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 220 టీఎంసీలు మాత్రమే వచ్చినట్లు ఆరోపించారు. ఢిల్లీలోని బీజేపీ అధిష్టానంతో కుమ్మకైన చంద్రబాబు తెలంగాణ హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించుకుపోతూ తెలంగాణ రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగునీరు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ తాగునీరు, ఎడమ కాల్వ కింద ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల పరిధిలోనూ తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. చంద్రబాబు సమన్యాయం మాటల్లో మాత్రమేనన్నారు.
కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయినట్లే.. ఇప్పుడు గోదావరి జలాలను కూడా అదే విధంగా తరలించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని హరీష్ రావు ధ్వజమెత్తారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసే నీటిని తరలించడం తప్పేం కాదని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని, అదే విధంగా కృష్ణా నదికి సంబంధించి, పెన్నా బేసిన్లో ప్రాజెక్టులు కట్టి కృష్ణా జలాలను విస్తృతంగా వాడుతున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని, 200 టీఎంసీల నీటిని పెన్నా బేసిన్కు తరలించే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాల కేటాయింపులో ఉమ్మడి రాష్ట్రానికి 1480 టీఎంసీలు ఇచ్చిందని, అప్పటి జీవో ప్రకారం 968 టీఎంసీలు తెలంగాణ హక్కు కాగా, ఇప్పుడు ఆ హక్కును కూడా బలితీసుకుంటున్నారని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, నీటి అక్రమ తరలింపును అడ్డుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబును హెచ్చరించారు.