ఉత్తర గుజరాత్ (North Gujarat) లో శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ (Richter Scale)పై 3.4గా నమోదైందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్(ISR) వెల్లడించింది. ISR విడుదల చేసిన నివేదిక ప్రకారం, బనాస్కాంత (Banas Kantha) జిల్లాలోని వావ్ (Vav) సమీపంలో భూకంప కేంద్రం గుర్తించబడింది. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 3:35 గంటల సమయంలో భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప కేంద్రం భూమిలో 4.9 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ISR తెలిపింది. ఈ ప్రాంతం గాంధీనగర్ (Gandhinagar)కు తూర్పు-ఈశాన్య దిశగా ఉంది.
ఎటువంటి నష్టం లేదు
జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం గానీ ఆస్తి నష్టం గానీ చోటుచేసుకోలేదని తెలిపారు. అయితే భూకంపాన్ని కొంతమంది స్థానికులు అనుభవించినట్లు వార్తలు వస్తున్నాయి. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ISR మరియు స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు పరిణామాలను పర్యవేక్షిస్తున్నాయి.