నటి రన్యారావు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికర విషయాలు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కస్టడీలో ఉన్న ఆమె విచారణలో వెల్లడించిన విషయాలను అందరినీ షాక్కు గురిచేస్తున్నాయి.
యూట్యూబ్ వీడియోల ద్వారా
డీఆర్ఐ అధికారులతో జరిగిన విచారణలో రన్యారావు.. ‘దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి. నాకు తెలియని నంబర్ల నుంచి రెండు వారాలుగా కాల్స్ వచ్చాయి. మార్చి 1వ తేదీన ఒక విదేశీ నంబర్ నుంచి కాల్ వచ్చింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 వద్ద గేట్ ఏ దగ్గరకు వెళ్లాలని సూచించారు. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని చెప్పారు’ అని తెలిపారు. ‘ఎయిర్పోర్ట్లో ఒక 6 అడుగుల పొడవున్న వ్యక్తి రెండు ప్లాస్టిక్ కవర్లలో బంగారం ఇచ్చాడు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ రెస్ట్రూమ్లో బంగారాన్ని నా శరీరానికి అతికించుకుని, జీన్స్, షూస్లో దాచుకున్నాను. ఇదంతా ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోల ద్వారా నేర్చుకున్నాను’ అని రన్యారావు చెప్పారు.
అనుమానాస్పద వ్యక్తులు
కాల్స్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, వారి యాస బట్టి ఆఫ్రికన్-అమెరికన్ అనిపించిందని ఆమె పేర్కొన్నారు. డెలివరీకి సంబంధించిన సమాచారం కోసం ఎయిర్పోర్ట్ టోల్గేట్ దాటి, సర్వీస్ రోడ్డులో ఉన్న ఆటోలో బంగారం పెట్టి వెళ్లాలని సూచించారని తెలిపారు. డీఆర్ఐ అధికారులు రన్యారావు గత ప్రయాణాలపై విచారణ జరుపుతున్నారు. ఆమె అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు వెళ్లిన విషయమై మరింత సమాచారం సేకరిస్తున్నారు.