గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్పై రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వైఎస్ జగన్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని వైసీపీ, కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నుంచి పుట్టిందని టీడీపీ. ఇలా ఇరు పార్టీలు ఎవరికి వారు ప్రాజెక్టు తమ ఆలోచననే అని చప్పట్లు కొట్టుకుంటుండగా, గోదావరి-జనకచర్ల ప్రాజెక్టుపై వైసీపీ నేత, గత ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చారు. జగన్ ఆలోచనను చంద్రబాబు తన క్రెడిట్లోకి వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పథకాన్ని కూడా చంద్రబాబు తనదిగా ప్రచారం చేసుకుంటారని ఆరోపించారు. ఇప్పుడు గోదావరి-బనకచర్ల లింక్ను కూడా తన సొంత ఆలోచనగా చెప్పడం దారుణమని, ఒకరి ఆన్సర్ షీట్ను కాపీ కొట్టి పాస్ అవ్వాలనుకోవడం నేరమే అవుతుందన్నారు.
ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు చరిత్ర
ఈ ప్రాజెక్టు దాదాపు రూ. 80 వేల కోట్ల ఖర్చుతో 2022లో ప్రతిపాదించబడి, 2022 మే 4న సీడబ్లుస్యీకి (Central Water Commission) వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ డీపీఆర్ సమర్పించిందని అంబటి పేర్కొన్నారు. గోదావరి నీటిని వృథా కాకుండా, దాన్ని కృష్ణా డెల్టా మరియు రాయలసీమకు వినియోగించాలని జగన్ ఆలోచనగా చెప్పారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని, చంద్రబాబు కేవలం క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంబటి విమర్శించారు.
రాజకీయ ప్రతిష్టంభన
ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ అనుమతులపై గొప్పగా ప్రచారం చేస్తున్నారని, ఇది ప్రజలను మోసం చేయడమేనని అంబటి రాంబాబు అన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఈ కూటమిప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, ఈ అంశంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు.







