పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడిపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. పాకిస్తాన్తో ఇకపై ఏ విధమైన క్రికెట్ సంబంధాలు కొనసాగించకూడదని గంగూలీ బీసీసీఐకి గట్టి సూచన చేశాడు. ఈ ఘటన క్రీడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నాడు.
గంగూలీ వ్యాఖ్యల వెనుక దేశభక్తి, ప్రజల భావోద్వేగాలకు ప్రతిబింబంగా కనిపించాయి. ‘‘ఇలాంటి దాడుల తర్వాత పాకిస్తాన్తో క్రికెట్ ఆడటమే సరైంది కాదు’’ అంటూ గంగూలీ తన వైఖరిని స్పష్టం చేశాడు. భారతదేశం ముందు క్రీడ కన్నా జాతీయ భద్రతే ముఖ్యం అని ఆయన చెప్పకనే చెప్పారు.
బీసీసీఐ క్లారిటీ..
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బీసీసీఐ.. పాకిస్తాన్ జట్టుతో ఇకపై ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో సంబంధాలు పెట్టుకోవడం సరికాదని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని, పాకిస్తాన్తో ఇకపై ద్వైపాక్షిక సిరీస్లపై చర్చ కూడా ఉండదని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.








