టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేసిన దాదా, క్రికెట్తో బిజీగా ఉండటం వల్ల రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని పేర్కొన్నారు. అయితే, టీమిండియా కోచ్ పదవి చేపట్టడానికి మాత్రం తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.
రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా, ఆపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB), బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన గంగూలీ, 2018-19, 2022-24 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్కు టీమ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.
తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ పలు కీలక విషయాలపై స్పందించారు. “క్రికెట్లో వేర్వేరు భిన్నమైన పాత్రల్లో ఉండటంతో రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. 2013లో క్రికెట్కు రిటైర్మెంట్ పలికి బీసీసీఐ అధ్యక్షుడిని అయ్యాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. నాకు ఇప్పుడు 52 ఏళ్లు. టీమిండియా కోచ్ పదవి చేపట్టడానికి నేను సిద్ధమే. అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం” అని దాదా తెలిపారు. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన గంగూలీ, కెప్టెన్గా తనదైన ముద్ర వేసి భారత జట్టుకు దూకుడు నేర్పిన ఘనత సాధించారు.
కోహ్లీ, రోహిత్లపై గంగూలీ వ్యాఖ్యలు:
2027 వన్డే ప్రపంచకప్లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై గంగూలీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ప్రతి ఒక్క ఆటగాడి మాదిరిగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి కూడా ఆట దూరమవుతుంది. అలానే ఆటకు వాళ్లు దూరమవుతారని మనం అర్థం చేసుకోవాలి. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఏడాదికి 15 మ్యాచ్లు ఆడుతూ ఫిట్గా ఉండటం, టీమిండియాలో చోటు సంపాదించడం వారికి అంత సులువు కాదు” అని దాదా అభిప్రాయపడ్డారు.
అయితే, వారికి తాను ఎటువంటి సలహా ఇవ్వదలుచుకోలేదని, “ఎందుకంటే నాకు తెలిసినంత క్రికెట్ వారికి కూడా తెలుసు. రోహిత్, కోహ్లీలే నిర్ణయం తీసుకుంటారు. విరాట్ అద్భుతమైన ఆటగాడు. అతడికి ప్రత్యమ్నాయ ఆటగాడు జట్టులోకి రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు.