శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఢటనతో హాస్టల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై దారుణానికి ఒడిగట్టారు. హాస్టల్లో మిగిలిన విద్యార్థినులు చూస్తుండగానే ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతిని లాక్కెళ్లిన కామాంధులు, ఆ విద్యార్థిపై లైంగికదాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. హాస్టల్లో భద్రతా లోపాలపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులు, యువతులపై అత్యాచారాలు ఎక్కువమయ్యాయి. రాష్ట్రంలో ఏదో ఒక మూలన రోజుకో సంఘటన వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా ఈ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. మహిళా రక్షణకు సంబంధించిన దిశ యాప్
ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.