ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన అమానుష ఘటన ఆడబిడ్డల తల్లిదండ్రుల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలికను మూడు రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
మూడు రోజులు బంధించి అమానుష చర్య
ఈనెల 9న రాత్రి స్నేహితురాలి ఇంటి నుంచి బయటికొచ్చిన బాలికను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన యువకులు బాలికను మూడు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో 8 మంది యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఇటీవలే 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి కావడం గమనార్హం.
వైసీపీ హయాంలో ప్రత్యేకంగా ‘దిశ’
ఈ అమానుష ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో చోట మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో ఈ రకమైన చర్చలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వైసీపీ హయాంలో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పోలీసులను ప్రత్యేకంగా నియమించి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించిన విషయం తెలిసిందే.