కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు (ఓఎంసీ)లో తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు గతంలో విధించిన ఏడేళ్ల జైలు శిక్షను హైకోర్టు నిలిపివేస్తూ తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఈ తీర్పుతో జనార్దన్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, ఆయన దేశం విడిచి వెళ్లవద్దని, తన పాస్పోర్టును సరెండర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు గత నెల 6న గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్లను దోషులుగా తేల్చి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నిందితులు, ఓఎంసీ కంపెనీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశాయి. మంగళవారం వాదనలు పూర్తయిన తర్వాత, న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. ఆ మేరకు ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.