ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భార్యనే భర్తను హత్య చేయించింది. వివాహం జరిగిన నెలరోజులకే భర్తను అతికిరాతకంగా చంపించేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గంటవీధికి చెందిన గంటా తేజేశ్వర్ (32) హత్య కేసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. పెళ్లయిన కేవలం నెల రోజులలోనే భార్య ఐశ్వర్య (అలియాస్ సహస్ర ఐశ్వరీ), ఆమె తల్లి సుజాత, కర్నూలుకు చెందిన ఓ బ్యాగరీతో కలిసి తేజేశ్వర్ను కిడ్నాప్ చేసి హత్య చేయించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం పరిధిలోని గాలేరు-నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమవడంతో ఈ ఘటన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో చర్చనీయాంశంగా మారింది.
తేజేశ్వర్, గద్వాలలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి గంటా జయరాం, శకుంతల దంపతుల చిన్న కుమారుడు. ప్రైవేటు సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అతను, కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన రామకృష్ణ, సుజాత దంపతుల కుమార్తె ఐశ్వర్యతో గత ఏడాది డిసెంబర్లో నిశ్చితార్థం జరిగింది. అయితే, ఫిబ్రవరి 13, 2025న జరగాల్సిన వివాహం ఐశ్వర్య కనిపించకపోవడంతో రద్దయింది. తల్లిదండ్రులు వద్దని చెప్పినప్పటికీ, ఐశ్వర్య పట్ల ప్రేమతో తేజేశ్వర్ మే 18న గద్వాలలోని బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఐశ్వర్య తల్లి సుజాత, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి తేజేశ్వర్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అయితే, జూన్ 17న తేజేశ్వర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు జూన్ 18న గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టగా, తేజేశ్వర్ను కొందరు వ్యక్తులు కారులో కర్నూలు జిల్లా వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసేందుకు చూపిస్తామని చెప్పి అతన్ని తీసుకెళ్లినట్లుగా తెలిసింది. కారు ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దాటి కర్నూలు వైపు తిరిగి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. జూన్ 21 రాత్రి నంద్యాల జిల్లా పాణ్యం పరిధిలోని పిన్నాపురం వద్ద గాలేరు-నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది.
పోస్ట్మార్టం నివేదిక హత్యను నిర్ధారించగా, కుటుంబ సభ్యులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కర్నూలులోని ఎస్బీఐ సర్కిల్ వద్ద ఉన్న ఓ బ్యాంకు హౌసింగ్ మేనేజర్పై అనుమానం వ్యక్తం చేశారు. ఐశ్వర్య వివాహేతర సంబంధం, తేజేశ్వర్ను అడ్డు తొలగించేందుకు ఈ హత్య జరిగినట్లు ఆరోపిస్తున్నారు. పరారీలో ఉన్న బ్యాంకు మేనేజర్, అతని డ్రైవర్ను పట్టుకునేందుకు గద్వాల, కర్నూలు పోలీసులు గాలింపు చేపట్టారు. కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా సమాచారం.