న్యూఇయర్కు రెండ్రోజుల ముందే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన కంటే రెండ్రోజుల ముందే మంత్రి నారా లోకేష్ లండన్కు చేరారు. వీరి విదేశీ పర్యటనపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. సీఎం పదవి కోసం అని, డబ్బులు దాచిపెట్టుకునేందుకనీ మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లారో ఏపీ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారో, అది అధికార పర్యటనా లేదా వ్యక్తిగత పర్యటనా అన్న విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఉందన్నారు. సాధారణంగా సీఎం విదేశీ పర్యటనలకు వెళ్తే ముందుగా అధికారిక ప్రకటన ఉంటుందని, కానీ ఈసారి జీఏడీకి కూడా చంద్రబాబు పర్యటనపై సమాచారం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చివరకు సొంత ఎల్లో మీడియాకే సీఎం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్రంలో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పలు పత్రికలు సింగపూర్, బాలి, జపాన్, లండన్ అంటూ రకరకాల కథనాలు రాస్తున్నా ప్రభుత్వంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైద్యం కోసం వెళ్లారని కొందరు, ఇతర పనుల కోసమని మరికొందరు రాస్తున్నా నిజం ఏంటో చెప్పడం లేదన్నారు. గతంలో జగన్ లండన్కు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు చేసిన రచ్చను గుర్తు చేస్తూ, ఇప్పుడు చంద్రబాబు పర్యటన విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేష్ మధ్య సీఎం కుర్చీ కోసం అంతర్గత పోరు నడుస్తోందని, లోకేష్ లండన్లో ఉన్నాడన్న సమాచారం రావడంతోనే చంద్రబాబు తన విమానాన్ని మరో దేశానికి మళ్లించారని ఆరోపించారు. మూడు హెలికాప్టర్లు, మూడు విమానాల్లో ముగ్గురు నేతలు తిరుగుతూ విలాసాలు చేస్తున్నారని, వాటికి అయ్యే ఖర్చు ఎంతనేది ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. సొంత ఖర్చుతో వెళ్తే తమకు అభ్యంతరం లేదని, కానీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తూ ప్రయాణాలు చేయడం సరికాదన్నారు.
ఇక మరోవైపు హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్పే ప్రభుత్వం, ఇలాంటి విలాసాలకు మాత్రం నిధులు ఎలా ఖర్చు చేస్తోందని సుధాకర్ బాబు ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని, ఈ ప్రభుత్వం చేస్తున్నది 420 పనులేనని విమర్శించారు. కొత్త సంవత్సరం కానుకగా రోడ్ సెస్ పేరుతో కొత్త పన్నులు, కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలపై వేల కోట్ల భారం మోపుతున్నారని, ఈ బిల్లులు చెల్లించలేక జనం అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.








