తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చారని తీవ్ర ఆరోపణ చేశారు. చంద్రబాబు భద్రత కోసం 2000 వేల మంది పోలీసులు ఉన్నారని, నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతం వద్ద కనీసం 10 మంది పోలీసులు కూడా లేరన్నారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తొక్కిసలాట ఘటన జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారని భూమన ఆవేదన వ్యక్తం చేశారు.
వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై భూమన కరుణాకర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్లపై మండిపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను ప్రకటించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తొక్కిసలాట ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో వైసీపీ, వైఎస్ జగన్పై అసత్య ఆరోపణలు చేసిన పవన్.. దీనిపై ఏం మాట్లాడతారని నిలదీశారు. పవన్ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదన్నారు.
తిరుమలను, దేవుడిని చంద్రబాబు తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నారని భూమన కరుణాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ అని దుయ్యబట్టారు. ఇవాళ చంద్రబాబు పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరన్నారు. తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాఏ బాధ్యత వహించాలన్నారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చే భక్తులకు కనీసం నీళ్లు, ఆహారం లేవని, తిరుమల కొండపై వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని భూమన అన్నారు. పశువుల మంద మాదిరి తొసిపారేశారని వ్యాఖ్యానించారు. తొక్కిసలాట ఘటన ప్రభుత్వ తప్పిదం కారణంగా జరిగిన ఘటన అని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యలేనని భూమన ఆరోపించారు. మృతిచెందిన భక్తుల కుటుంబాలకు రూ.1కోటి చొప్పున, గాయపడిన వారికి 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే టీటీడీ ఈవో, జేఈవోలను సస్పెండ్ చేయాలని భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు.