తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో (Politics) అసెంబ్లీ ఎన్నికల ముందు భారీ మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (AIADMK)బహిష్కృత నేత పన్నీర్ సెల్వం (O. Panneerselvam) డీఎంకే పార్టీ (DMK Party)లో చేరడం సంచలనంగా మారింది. సీఎం ఎంకే స్టాలిన్ (M.K. Stalin) స్వయంగా శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా, రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. డీఎంకేలో చేరిన అనంతరం పన్నీర్ సెల్వం మాట్లాడుతూ స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామిపై (Edappadi K. Palaniswami) తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయన నాయకత్వంలో ఏఐడీఎంకే భవిష్యత్తు లేదని, పార్టీలో ఎదగడానికి నాయకులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.
2001లో పెరియకులం నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన పన్నీర్ సెల్వం, జయలలితా మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. టాన్సీ కేసు సమయంలో మొదటిసారి సీఎం పదవి చేపట్టగా, 2014లో జయలలితా జైలుకు వెళ్లినప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె మరణం తర్వాత మూడోసారి సీఎం బాధ్యతలు స్వీకరించారు. 2017లో ధర్మయుద్ధం ప్రకటించి పార్టీ అంతర్గత పోరులో నిలిచిన ఆయన, రెండు సంవత్సరాల క్రితం ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరఫున పోటీ చేసి ఓటమి చవిచూసిన పన్నీర్ సెల్వం, తాజాగా డీఎంకేలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది.








