వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్పై ఆయన భార్య పంకజశ్రీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ తనకు సమాచారం ఇవ్వలేదని, తన భర్త ఆరోగ్యం బాగోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని పంకజశ్రీ ఆరోపించారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించి, వంశీని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వంశీ అరెస్ట్పై ఆయన భార్య పంకజశ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కచ్చితంగా హైకోర్టుకు వెళ్తా..
‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. వంశీ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కూడా కనీసం చెప్పడం లేదు. ఈ విషయంపై కచ్చితంగా హైకోర్టుకి వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం` అని పంకజశ్రీ అన్నారు.
అనుమానాలకు బలాన్నిస్తున్న టీడీపీ చేష్టలు
వంశీ అరెస్టుపై టీడీపీ సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ఆ పార్టీ కార్యకర్తలు భుజానికి ఎత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. టీడీపీ చేష్టలు వంశీ భార్య పంకజశ్రీ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.