తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుండగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్ ప్రమాదం చాలా దురదృష్టకరమని, ప్రమాదం జరిగి ఇప్పటికి వరకు ఐదు రోజులు కావస్తున్నా, సహాయక చర్యలు నత్తనడకన కొనసాగుతున్నాయని హరీశ్రావు మండిపడ్డారు.
టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులు ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారని, వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం అమూల్యమైనదని, అయినా ప్రభుత్వం స్పందన చాలా బాధాకరం అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
ప్రచారం ముఖ్యమా, ప్రాణాలా?
సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ప్రచారం ముఖ్యమా? కార్మికుల ప్రాణాలా? అని ఆయన నిలదీశారు. సీఎం హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు కానీ, కనీసం టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలపై సమీక్ష జరిపే సమయం ఆయనకు లేదా అని ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యమే కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.