ఏపీ అప్పులపై ఇన్నాళ్లుగా ప్రజల్లో కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెరదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా అప్పుల గురించి వివరణ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ రూ.14 లక్షల కోట్లు, రూ.10 లక్షల కోట్లు అని కూటమి నేతలు చేసిన ప్రచారం తప్పని ఆర్థికమంత్రి సమాధానంతో తేలిపోయింది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల రుణాలపై చర్చ సందర్భంగా మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు గానూ ఏపీ అప్పులపై మంత్రి పయ్యావుల సమాధానం ఇచ్చారు.
2024 జూన్ నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 5లక్షల 19వేల 192 కోట్లు మాత్రమేనని, కార్పొరేషన్ల అప్పు 1,58,657 కోట్లని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. మంత్రి పయ్యావుల అప్పుల లెక్కలతో మండలిలోని టీడీపీ సభ్యులే ఖంగుతిన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 జూన్ 2 నాటికి 97,156.82 కోట్లు అప్పు, కార్పొరేషన్లకు 10,675 కోట్ల అప్పు ఉండగా ఐదేళ్లలో 2018-19లో చంద్రబాబు పరిపాలన ముగిసే 2,57,509 కోట్లకు చేరిందని, కార్పొరేషన్ల అప్పు రూ.49వేల కోట్లు అయ్యిందని మంత్రి పయ్యావుల చెప్పారు. 2024 జూన్ నాటికి 5లక్షల 19వేల 192 కోట్లు ప్రభుత్వ అప్పు ఉందని, కార్పొరేషన్ల అప్పు 1,58,657 కోట్లు మాత్రమేనని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. గ్యారంటీలు ఇవ్వని అప్పు 97వేల కోట్లు అని చెప్పారు. 31 డిసెంబర్ 2024 నాటికి ప్రభుత్వ అప్పు రూ.5,63,376 కోట్లు అయ్యిందని, పబ్లిక్ సెక్టార్ అప్పు 1,53, 624 కోట్లు, గ్యారంటీలు ఇవ్వని అప్పు రూ.91వేల కోట్లు అని వివరించారు. కూటమి సర్కార్ వచ్చాక డిసెంబర్ వరకు నికర అప్పులు 44,124 కోట్లుగా ఉంది.
వైసీపీ హయాంలో..
అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్స్లో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఇటీవల ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.5,19,192 కోట్లు మాత్రమే కాగా, ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు 1,58,657 కోట్లు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన మొత్తం అప్పులు 3,39, 580 కోట్లు మాత్రమేని అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ విడుదల చేసిన సమాధానంలో వెల్లడైంది. ఇందులో వైఎస్ జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు కాగా, కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు రూ.1,05,355 కోట్లు మాత్రమే అని తేలిపోయింది.
జగన్పై తప్పుడు ప్రచారం..
కాగా, గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని, అప్పు రూ.10 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని చెబుతూ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని, అప్పుల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.