కాకినాడలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి ఉన్నతికి బాటలు వేయాల్సిన కన్న తండ్రే వారిని కడతేర్చాడు. లోకం తెలియని పసివారిని అనంత లోకాలకు చేర్చాడు. పిల్లలను చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
కాకినాడ తోటసుబ్బారావు నగర్ భూదేవి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వానపల్లి చంద్రకిశోర్ వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. వానపల్లి చంద్రకిశోర్(37)కు ఇద్దరు కుమారులు జోషిత్(7) మరియు నిఖిల్(6) ఉన్నారు. కాగా, శుక్రవారం వారి కాళ్లుచేతులతో తాళ్లతో కట్టేసి, బకెట్లో నీటిలో ముంచి చంపాడు. అనంతరం, ఆయన కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్ సూసైడ్ నోట్లో “పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేరని” భయంతో ఈ దారుణమైన చర్య చేపట్టానని పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సర్పవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.